వశిష్ఠాదులు కైకేయి మందిరానికి రావడం
కైకేయి: మహారాజా! సత్యమనే ఒక్క పదమే బ్రహ్మస్వరూపం, ధర్మం సత్యంపై ఆధారపడి ఉంటుంది. సత్యమే అక్షయవేదాలు. ఎవరైనా సత్యాన్ని ఆచరించటం చేతనే పరమపదాన్ని చేరుకుంటారు. ధర్మవేత్తలైన వారంతా సత్యమే ధర్మమని అంటారు కదా! నేను కూడా సత్యాన్నే ఆశ్రయించి నిన్ను ధర్మాన్ని ఆచరించమని ప్రేరేపిస్తున్నాను.
నా కిచ్చిన ప్రతిజ్ఞను (వరములు) గుర్తుచేయగానే మహాపాపం చేసినట్లు దుఃఖీస్తూ నేలపై పడి పొర్లుతున్నావు. ధర్మాన్ని పాటించు. ఆ ధర్మమే నీకు సత్కీర్తిని, ఉత్తమగతుల్ని కలిగిస్తుంది.
పూర్వం శిబిచక్రవర్తి తన దేహంలోనుండి మాంసాన్ని డేగకు ఇచ్చి ఉత్తమలోకాలు పొందాడు. మహాతేజశాలియైన అలర్కుడు బ్రాహ్మణుడు వచ్చి అడగ్గానే, తన నేత్రాలను తీసి ఇచ్చివేశాడు. సముద్రుడు కూడా సత్యాన్ని పాటిస్తూ వృద్ధి సమయాల్లో కూడా చెలియలికట్టను దాటిరావడం లేదు.
ఓ పురుషశ్రేష్ఠుడా! నీ బుద్ధిని స్థిరంగా ధర్మంపైనే నిలుపు. నాకు ఇచ్చిన వరాలను అమలుచెయ్యి. వరాలిచ్చిన నీకు వాటిని తీర్చడమే ధర్మం. అది నెరవేర్చమని నిన్ను ప్రేరేపిస్తున్నాను. ముమ్మాటికీ రాముణ్ణి అడవులకు పంపమని చెబుతున్నాను.
నాథా! నువ్వు వరాలు ఇవ్వకుండా అసత్యాన్నే వరించి నట్లయితే, నన్ను విడిచివేసినట్లే భావిస్తాను. అందువల్ల నీ ఎదుటే ప్రాణాలు విడుస్తాను.
పూర్వం వామనుడు ధర్మపాశంతో బలిచక్రవర్తిని బంధించినట్లు కైకేయి దశరథుణ్ణి ధర్మపాశంచే బంధించివేసింది, కాడికి, చక్రానికి మధ్య బంధించబడిన ఎద్దులా దశరథుడు నలిగిపోతున్నాడు. హృదయం పగిలిపోయింది. ముఖం పాలిపోయింది. కళ్లు వ్యాకులత చెందాయి. దృష్టి మందగించింది. అతికష్టంతో ఎట్లాగో నిలదొక్కుకున్నాడు.
దశరథుడు: పాపాత్మురాలా! అగ్నిసాక్షిగా ఏ చేత్తో నిన్ను పరిగ్రహించానో, అదే చేత్తో నిన్నూ, నీ వలన పుట్టిన భరతుణ్ణి కూడా విడిచేస్తాను. సూర్యోదయం కావస్తోంది. రామరాజ్యాభిషేకానికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. వసిష్ఠాదులు వచ్చే సమయం దగ్గర పడుతోంది.
ఓ దురాచారురాలా! నువ్వు రాముని రాజ్యాభిషేకానికి అడ్డుపడే పక్షంలో నువ్వుగాని, నీ కుమారుడు భరతుడుగాని మరణానంతరం ఉత్తరక్రియలు జరుపకూడదు. రామపట్టాభిషేకానికి సిద్ధంచేసిన మంత్రజలాలతో రాముడే నాకు ఉదకక్రియలన్నీ జరపాలి. ప్రజలంతా రామపట్టాభిషేకమని మహా ఆనందంతో పరవశులై ఉన్నారు. ఇప్పుడు వారి ఆనందమంతా నశించిపోతుంది. తలలు వంచుకొని దుఃఖంతో ఉన్న వాళ్ళ ముఖాలను నేను. చూడలేను.
కైకేయి: రాజా! మీ మాటలు చాలా తీవ్రంగాను, బాధాకరంగాను ఉన్నాయి. మాటలతో కాలాన్ని వృథాచేయకండి. రాముణ్ణి వెంటనే ఇక్కడకు పిలిపించండి. వెంటనే రాముడు వనాలకు వెళ్ళేట్లు ఏర్పాట్లు చేయండి. అప్పుడే నాకు శత్రువులెవరూ లేకుండా ఉంటారు. నీ ధర్మాన్ని వెంటనే అమలు పరచండి..
దశరథుడు: దుష్టబుద్ధి గలదానా! నన్ను ధర్మపాశంచేత బంధించి వేశావు. నా బుద్ధి బొత్తిగా మొద్దుబారిపోయింది. నేనుకూడా నా రాముణ్ణి వెంటనే చూడాలనుకొంటున్నాను.
ఇంతలో సూర్యోదయమైంది. వసిష్ఠాదులు రాజ్యాభిషేకానికి కావలసిన సామగ్రి అంతా వెంటతీసుకొని అయోధ్యానగరంలో ప్రవేశించారు.
అయోధ్యలోని వీధులనన్నింటినీ నీళ్ళుచల్లి ముగ్గులుపెట్టారు. అందమైన పతాకాలు ఎగురవేశారు. మార్గమంతా పువ్వులు, రంగులు చల్లారు. ఎక్కడ చూసినా అనందోత్సాహాలే. ప్రజలంతా రాముని చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వీధులన్నీ రూపాల సువాసనలతో నిండిపోయాయి. రాజాంతఃపురానికి ఎదుట బ్రాహ్మణులు గుంపులుగుంపులుగా నిలబడ్డారు. గ్రామ, పట్టణ ప్రజలతో నగరమంతా క్రిక్కిరిసిపోయింది. వసిష్ఠ మహార్షి మంత్రజలాలతో అంతఃపురంలోకి ప్రవేశించారు. అంతలోనే ఆయనకు సుమంత్రుడు ఎదురుగా వచ్చాడు.
వసిష్ఠ మహర్షి: మహామంత్రి! సుమంత్రా! గంగాజలంతో నిండిన కలశాలు, సముద్రజలాలతో నిండిన కలశాలు, భద్రపీఠం అభిషేకం కోసం తెచ్చాము, నవధాన్యాలు, గంధం, రత్నాలు, దర్భలు, పూలు, పాలు మొదలైన ద్రవ్యాలు, ఎనమండుగురు కన్యలు, మదించిన ఏనుగు, నాలుగు గుర్రాలు కట్టిన రథం, ఖడ్గం, ధనుస్సు అమర్చబడ్డాయి. తెల్లని గొడుగు, వింజామరలు ఏర్పరచారు. పెద్ద మూపురం కలిగిన తెల్లని ఎద్దు, అందమైన జూలు కలిగిన శ్రేష్ఠమైన గుర్రము, సింహాసనం, పులిచర్మాలు, ప్రజ్వలించే అగ్ని, ఇంకా అవసరమైన ద్రవ్యాలన్నీ సమకూర్చారు. చక్కగా అలంకరించుకున్న అందమైన వేశ్యలు వచ్చారు. కులస్త్రీలు, బ్రాహ్మణులు, గోవులు, శిల్పులు, వర్తకులు ఇంకా ఎంతోమంది గ్రామీణులు, నగరవాసులు కూడా వచ్చారు. కనుక ఓ సుమంత్రా! నువ్వు వెంటనే పోయి మహారాజును తీసుకొనిరా.
సుమంత్రుడు అంతఃపురం లోనికి ప్రవేశించాడు. మహారాజుకు అత్యంత ప్రియమైన వాడవడం చేత పాలకులు వారిని అడ్డగించలేదు. రాజు పరిస్థితిని ఎరుగక సుమంత్రుడు ఇట్లు స్తుతించసాగాడు.
సుమంత్రుడు: ఓ దశరథ మహారాజా! సూర్యోదయానికి ఉప్పొంగే సముద్రుడు ఆనందించేట్లు సంతోషమైన మనస్సుతో అనందించు. మహారాజా! ఇటువంటి ప్రాతఃకాలంలోనే మాతలి దేవేంద్రుని స్తుతించి మేల్కొలిపినట్లు నేను కూడా నిన్ను అట్లే మేల్కొలుపుతున్నాను..
తనంతట తానే పుట్టినవాడూ, వేదాలకు ప్రభుమా అయిన బ్రహ్మదేవుని మేల్కొలిపినట్లు నేను నిన్ను మేల్కొలుపుతున్నాను. ప్రాణులన్నింటినీ భరించే భూదేవిని సూర్యచంద్రులు మేలుకొలిపినట్లుగా నిన్ను నేను మేలుకొలుపుతున్నాను. మేరుపర్వతం నుంచీ సూర్యుడు లేచివచ్చేట్లుగా చక్కటి దుస్తులు, ఆభరణాలు ధరించి లేచి రా. ఓ రాజా! ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, శివుడు, కుబేరుడు, సూర్యచంద్రులు నిన్ను అన్ని విధాలా కాపాడతారు గాక!
మహారాజా! రాత్రంతా జరగబోయే ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. అన్నీ రామరాజ్యాభిషేకానికి సిద్ధం చెయ్యబడ్డాయి. రామాభిషేకానికి అనుజ్ఞ కోరుతున్నాం.
దశరథుడు పడుకునే సుమంత్రుడి ప్రార్ధనను అలకించాడు. అది ఆయనకు సంతోషాన్ని కలిగించక పోగా, కడుపంతా దేవినట్లయింది. "ఓ సుమంత్రా! నీ స్తోత్రాలన్నీ నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి" అని దీనంగా అన్నాడు. ఆ మాటలు కూడా ఎక్కడో నూతిలో నుంచి వస్తునట్లు అతి నీరసంగా ఉన్నాయి. ఆ పైన ఆయన మాట్లాడలేకపోయాడు. మహారాజు అతి దీనస్థితిలో ఉన్నాడని గ్రహించిన సుమంత్రుడు కొద్దిదూరం పోయి ఆజ్ఞకై నిలబడ్డాడు.
కైకేయి: ఓ సుమంత్రా! రాముని విషయం ఆలోచిస్తూ రాత్రంతా ఆయన నిద్రపోనేలేదు. ఇప్పుడే కొద్దిగా కునుకు పట్టింది. అందుచే మీరు వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడకు తీసుకొనిరండి. ఈలోగా ఆయన లేచి సిద్ధం కాగలరు.
కైకేయీదేవి మాటలనే ఆజ్ఞగా తీసుకొని సుమంత్రుడు రాముని అక్కడకు తీసుకొని రావటానికి వెంటనే బయలుదేరాడు. రామునికి మహారాజుకు కానుకలిచ్చేందుకు రాజులు, ధనవంతులైన పౌరులు, అంతఃపురం బయట వేచి ఉన్నారు. వీధులన్నీ జనంతో కిటకిటలాడిపోవటం చూసి సుమంత్రుడు ఆనందంతో రాముని మందిరం వైపుగా బయలుదేరాడు.
Comments