దశరథుడి విలాపం
దశరథుడు పుణ్యమంతా ఖర్చయిపోయి స్వర్గంనుండి భూమిపైపడిన యయాతిలా. నేలపై పడి ఉన్నాడు. ఇట్లా దీనంగా పడి ఉండటం గాని, కాళ్ళవేళ్ళా పడటంకాని ఆయన స్వభావం కాదు; ఆయనకు అలాంటి అనుభవమూ లేదు. కైకేయి భర్త అనే భయం, లజ్జ, బిడియం అన్నీ వదిలి వేసింది. పదే పదే అవే వరాలు కావాలని పట్టుపట్టింది. పైగా "నేను సత్యవంతుడననీ, చేసిన ప్రతిజ్ఞ నెరవేరుస్తాననీ బడాయి మాటలు మాట్లాడతావు. తీరా వాటిని ఇవ్వవలసి వచ్చే సమయానికి బీదఏడుపులు ఏడుస్తున్నావు. అసలు నా కిచ్చిన వరాలు ఎందుకు కాదంటున్నావు" అంటూ నిలదీసింది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది.
అప్పుడు దశరథుడు కోపంగా దుష్టురాలా! నీ కన్నా శత్రువులే నయం సుమా! రాముడు అడవులకు వెళ్లి, నేను మరణించిన తర్వాత నీవు ఒక్కతెవే సుఖంగా ఉండు. మరణానంతరం నేను స్వర్గానికి పోయినప్పుడు దేవతలంతా రాముడి క్షేమం అడుగుతారు. నేను ఏం చెయ్యాలి? యథార్థం. చెప్పకుండా దాటవేయనా? ఒకవేళ నేను నిజమే చెప్పినా వారు నమ్మరు. ఎందువల్లనంటే, “రాముడికి రాజ్యం ఇస్తానని దశరథుడు రాజులందరి ముందూ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను భంగంచేస్తూ కైకేయి మాటలు వినవలసిన అవసరంలేదు కదా?” అంటారు.
కైకా! ఎంతోకాలం మనమంతా సంతానం కోసం అలమటించాం. ఎన్నో వ్రతాలు, యాగాలు చేశాం. చివరకు మహాపరాక్రమవంతుడైన రాముణ్ణి పొందగలిగాం. అటువంటి రాముని ఎట్లా అడవులకు పంపగలను? రాముడు శూరుడే కాదు అన్ని విద్యలూ అభ్యసించినవాడు; కోపాన్ని జయించినవాడు; సహనమూ, శీలముగలవాడు: చెంపకు చారడేసి కళ్ళున్న రాముణ్ణి అడవులకు ఎట్లా పంపగలను?
ఆహా! నా రాముడు శ్యామవర్ణంతో మెరిసిపోతూ ఉంటాదు. దీర్ఘ బాహువులు గలవాడు, మహాబలశాలి అయిన రాముని అడవులపాలు చెయ్యలేను. రాముడు ఇక్ష్వాకువంశంలో పుట్టాడు. కష్టాలంటే ఏమిటో ఎరుగనివాడు. అటువంటి రాముణ్ణి అడవులకు ఎట్లా పంపను? రాముడు కష్టపడటం అనే మాటే నేను వినలేను. రాముడు కష్టపడుతున్నాడనే మాట నా చెవిన పడకమునుపే నేను మరణిస్తాను. అదే నాకు ఉత్తమం.
ఓ కఠినాత్మురాలా! నీకు ఇటువంటి పాపిష్టి ఆలోచన ఎట్లా వచ్చిందో నాకు తెలియటంలేదు. నీ మూలంగా లోకంలో నాకెంత అపకీర్తి వస్తుందో ఆలోచించావా?
దశరథుడు మధ్య మధ్యలో మూర్ఛపోతున్నాడు. లేవగానే మళ్ళీ కైకేయిని చూసి విలపిస్తూనే ఉన్నాడు. ఇంతలో చీకటి పడింది. చంద్రోదయమై ఆకాశమంతా వెన్నెలకాస్తున్నా ఆయన మనస్సు మాత్రం చీకటిగానే ఉంది. రోగిష్టి వాడిలాగా నీరసించిపోయాడు. మధ్యమధ్యలో నిట్టూర్పులు విడుస్తూ తనలో తానే కుమిలిపోతున్నాడు. "ఓ రాత్రీ! నువ్వు శాశ్వతంగా రాత్రిగానే ఉండిపో. ఎప్పటికీ తెల్లారవద్దు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకవేళ నీకు కనికరంలేక తెల్లవారితే మళ్ళీ ఈ పాపిష్టిదాని ముఖాన్ని చూడాల్సివస్తుందే! నన్ను కనికరించు" అని అంటున్నాడు.
మళ్ళీ కైకేయితో ఇలా చెప్పసాగాడు.
ఓ దేవీ! నువ్వు నా భార్యవు. మంగళ స్వరూపిణివి. నేను ఇంతకాలం సత్యవ్రతుడుగా బ్రతికాను. జీవితంలో చివరి భాగానికి చేరుకొన్నాను. ఇంకా ఎంతోకాలం బ్రతుకను. నిన్ను శరణు కోరుతున్నాను. నువ్వు చిన్నదానవు. చక్కటి విచక్షణా జ్ఞానం కలిగినదానవు. ఈ రాజ్యమంతా నీకే ఇచ్చేస్తాను. నీ చేతులతో ఆ రాజ్యాన్ని రాముడికి అప్పగించు. భరతుడుకూడా ఇందుకు అంగీకరిస్తాడు. గురువులు, మంత్రులు, ప్రజలు నిన్ను పూజిస్తారు, గౌరవిస్తారు. నీ కీర్తి ఆచంద్రార్కం శాశ్వతంగా ఉంటుంది. నేనూ మాట తప్పని వాణ్ణి అవుతాను. ఈ మార్గం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. నా కన్నీళ్ళు నదులై ప్రవహిస్తున్నాయి. కనికరించు.
దశరథుడు జాలిపుట్టేట్లు ఎన్ని మాటలు చెప్పినా కైకేయి మనస్సు కరగలేదు. ఆమె తన పట్టు విడువలేదు. కఠినమైన భార్య మాటలకు తట్టుకోలేక దశరథుడు మరల మూర్చపోయాడు. అంతలోనే రాత్రి గడచిపోయింది. ప్రాతఃకాలాన వందిమాగధులు వచ్చి మేలుకొలుపులు ప్రారంభించారు. దశరథుడు వారందరినీ నిలిపివేయమని పలికి తిరిగి మూర్చపోయాడు.
Comments