యువ రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు
సభలో చెప్పిన మాటలకు దశరథుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు : రాజులారా! పట్టణ, గ్రామాధ్యక్షులారా! రాముణ్ణి గూర్చి మీరు పలికిన మాటలన్నీ యథార్థాలే! నాకు కూడా ఇష్టుడైన నా పెద్ద కుమారుడు రాముడి యువరాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను.
వసిష్ట మహర్షీ! మహర్షులారా! పూజ్యులైన బ్రాహ్మణోత్తములారా! చెట్లు, వనాలు చిగురించే చైత్రమాసంలో రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయించండి. వసిష్ట మహర్షీ! పూజ్యుడా! రాముని యువరాజ్యాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే స్వయంగా చూడండి.
అప్పుడు వసిష్టుడు ఇలా పలికాడు: ఓ మంత్రులారా! బ్రాహ్మణులారా! అధికారులారా! 'ఐంగారం, రత్నాలు, అన్ని రకాలైన ధాన్యాలు, నూతన వస్త్రాలు, తేనె, నెయ్యి, పేలాలు, రథాలు, ఆయుధాలు, చతురంగ బలాలను సిద్ధం చేయండి. పట్టపుటేనుగుకు తెల్లని వస్టాలు
ధరింపజేయండి; తెల్లని గొడుగును, బంగారు కలశాలను, మేలుజాతి ఎడ్ల కొమ్ములకు బంగారు తాపడలు ధరింపజేసి రాజుగారి యాగశాలకు చేర్చండి. ఏ ఒక్క చిన్న వస్తువు కూడా మరువకుండా అక్కడ సమకూర్చండి.
అధికారులారా! నగర ద్వారాలన్నీ చందనపు నీటితో కడగండి. పుష్పమాలలతో అలంకరించండి. కమ్మటి సువాసనలు వెదజల్లే ధూపాలను వేయండి. బ్రాహ్మణులు, అతిథులంతా తృప్తిగా భోజనం చేసేట్లుగా చక్కటి భక్ష్యాలను, కమ్మటి పెరుగుపాలతో కూడిన
భోజనాలను వండించండి. రేపు ఉదయానికల్లా ఈ భక్ష్యాలన్నీ సిద్ధం కావాలి. సూర్యోదయం కాగానే స్వస్తి వచనాలు పలుకుతారు; వెంటనే బ్రాహ్మణులు కూర్చునేందుకు ఆసనాలు ఏర్పాటు చేయండి.
వీథులన్నీ కడిగి ముగ్గులు పెట్టించండి. ప్రజలకు ఆనందాన్ని కలిగించే నటులు, వేశ్యా స్త్రీలు రాజ్యప్రాసాదపు రెండవ కక్ష్య వద్ద ఉండేట్లు చేయండి. దేవాలయాలన్నింటిలో నైవేద్యానికి అన్నిరకాలైన ప్రసాదాలను సిద్ధంచేయండి. దక్షిణలు సమృద్ధిగా ఇవ్వండి. యుద్ధవిద్యలందు ఆరితేరిన యోధులందరినీ వారి వారి శస్థాలను ధరించి రాజప్రాసాదానికి ఎదుట నిలపండి.
ఆ విధంగా దశరథుని అభీష్టానికి తగ్గట్లుగా వసిష్టుడు కింది ఉద్యోగులందరికీ ఆదేశాలిచ్చాడు. ఏర్పాట్లన్నీ స్వయంగాను, మంత్రులతోను పరిశీలించి తిరిగి దశరథునికి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగాయని తెలిపాడు. అంతట దశరథుడు రాముని సభా మండపానికి
పిలిపించాడు.
దేశం నలుమూలలనుండి సామంతరాజులు, అధికారులు వచ్చారు. వారంతా రాముని గూర్చి తమ అభిప్రాయాలను దశరథ మహారాజుకు నివేదించుకున్నారు. వారంతా కూడా సూర్యోదయానికి ముందే సభాస్థలానికి వచ్చి దశరథుని సందర్శించుకున్నారు. దేవతల మధ్యనున్న దేవేంద్రునిలా దశరథ మహారాజు సామంతరాజుల మధ్య తన రాజప్రాసాదంలో నిలబడ్డాడు.
అమిత రూపవంతుడు, చంద్రకాంతులవలె మనోహరమైన ముఖం కలవాడు, మహాబలశాలియై మదించిన ఏనుగుమల్లే వస్తూన్న రాముని, దశరథుడు తన రాజప్రాసాదం నుండే. చూశాడు. గంధర్వరాజులా ప్రకాశిస్తూన్న తన కుమారుణ్ణి చూసి దశరథుడు
ఉప్పొంగిపోయాడు. అలాంటి రాముడు సుమంత్రుని అనుసరించి దశరథ మహారాజు వద్దకు వచ్చాడు. తండ్రిని చూడగానే ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
అప్పుడు దశరథుడు రాముని లేవనెత్తి కౌగలించుకొని ముద్దాడాడు. సాదరంగా రాముని తీసుకొనిపోయి మణిమయరత్నాలతో అలంకరించబడిన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. ఆసనం మీద కూర్చున్న రాముడు మేరుపర్వతాన్ని దాటి వస్తున్న ఉదయసూర్యునిలా ప్రకాశించాడు. అటువంటి రాముణ్ణి దిగ్భమతో చూస్తూన్న దశరథుడు తన ప్రతిబింబాన్ని తానే చూసుకుంటున్నట్లు అనుభూతి చెందాడు. ఆహా! కాశ్యపుడు కూడా దేవేంద్రుని చూసుకొని తన మాదిరే ఆనందించి ఉంటాడని తలచాడు.
అప్పుడు దశరథుడు రాముడిని చూసి ఇలా అన్నాడు: ఓ రామా! పరమయోగ్యురాలైన నా పట్టమహిషి కౌసల్యాదేవి యందు జన్మించావు. నాకు పెద్ద కుమారుడవు. నీవు సకల సుగుణాభిరాముడవడం వలన నాకు చాలా ప్రియమైనవాడవు. ప్రజలందరినీ విచారించాను, వారందరినీ నీ గుణగణాలచే రంజింపచేశావు. ఈనాడు పుష్యమీ నక్షత్రం. శుభదినమని పెద్దలు నిర్ణయించారు. అందు వలన
ఈ శుభనక్షత్రాన నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయాలని నిర్ణయించాను.
నాయనా! కుమారా! నీవు సకలసుగుణాలకు రాశివే అయినా, ఈ సందర్భానుసారంగా కొన్నిమాటలు చెప్తాను. శ్రద్ధగా విను.
రామా! వినయాన్ని ఇంకా పెంపొందించుకో. ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. కోరికలను, వ్యసనాలను, క్రోధాన్ని దగ్గరకు రానీయకు. జితేంద్రియుడవుగా ఉండు. [జూదం, పగటినిద్ర, వేటాడటం, ఇతరుల దోషాలను ఎంచడం, స్త్రీలతో భోగాలనుభవించడం, మద్యాన్ని
సేవించడం, నృత్యం, గీతం, వాద్యం, ఊరకే దేశాటనం చేయడం వంటి పదిరకములైన కోరికలను వ్యసనాలంటారు.]
[ఇవి కాక క్రోధంతో వచ్చే వ్యసనాలు ఎనిమిది ఉన్నాయి. అవి: 1. చాడీలు చెప్పడం 2.'సత్పురుషులను బంధించడం 3. ద్రోహబుద్ధి 4. అసూయ 5. ధనాన్ని అపహరించడం 6. ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వకపోవడం 7. పరుషమైన పదాలతో మాట్లాడడం 8. ఇతరులను కొట్టడం. ఈ ఎనిమిది వ్యసనాలకు దూరంగా ఉండు.]
రామా! పరోక్షంగాను, ప్రత్యక్షంగాను పనిచేసే మంత్రులు, రాజోద్యోగుల వంటి వారిని సంతోషపరుస్తూ ఉండాలి. ఈ విధంగా నువ్వు కూడా ఆత్మనిగ్రహం కలిగి రాజోద్యోగులను ఆనందపరచు.
దశరథుని మాటలు వింటున్న వారిలో కొందరు కౌసల్యాదేవిని సంతోషపెట్టాలని ఉత్సాహంగా వెళ్ళి ఆమెకు ఈ శుభవార్తను తెలిపారు. ఆమె వారందరికీ బంగారం, గోవులు, రత్నాలను ఇచ్చి సంతోషపరచింది.
తరువాత రాముడు, దశరథ మహారాజుకు నమస్కరించి, సభలోని జనులంతా జయజయధ్యానాలు.. చేస్తూ. ఉండగా రథమెక్కి తన గృహానికి వెళ్లాడు. అప్పుడు సభాసదులందరూ దశరథ మహారాజును అభినందించి ఇళ్ళకు వెళ్లారు.
Comments