నక్కతోక మహిమ
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్న వేళ కవులందరిని పిలిపించుకుని భువనవిజయం మందిరంలో సరదాగా గడప సాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతీ కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు. ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరీ రచించాను అని ఒకవిధంగా గొప్పలకు పోయాడు. కవులందరూ ఉల్లాస భరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింత రాయలువారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే....... రామలింగకవి చిరునవ్వు మోహముతో వినసాగాడు. ఆకావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతి మించాయి. ఒకవిధంగా ఆకాసానికి ఎత్తేసారు.
నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆకావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి. మానవబాష నేర్చుకున్న మహాజ్ఞాని, రామభక్తుడు. అతడికి మానుష్య రూపంలో గల ఓ అందాల అపరంజిబొమ్మ లాంటి కూతురు జాంబవతి. ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడుతో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కధనంలో జాంబ వంతుడు మానవభాష నేర్చుకున్నట్టు నేను ఎలుగుబాషను తెలుసుకుని మరీ రాసాను అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామ లింగని వైపు చూసాడు. అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తనముఖంలో కనిపించనీయకుండా మౌనముద్రతో వింటుంటే ఆశ్చర్య పోయాడు.
రామలింగా, ఏమిటా పరధ్యానం ? నాకావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా ? మరి అందరిలా విని ఆనందించలేదు. కనీసం తప్పేమి చూపలేదు సరికదా ఇక్కడ ఉన్నట్టులేరు, పరధ్యానంగా ఉన్నారు. ”
ప్రభూ ! మీ జాంబవతీ కళ్యాణం గురించి చెప్తుంటే జిత్తులమారి నక్కతో నా సంభాషణ గుర్తుకు వచ్చింది. ఆ కధ తమరు తప్పక వినాల్సిందే నన్నాడు. కవులు అదోలా చూసారు. అలసాని పెద్దన, దూర్జటి. నంది తిమ్మన, రామరాజ భూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు. అయ్యల రాజు రామభద్రుడు మాత్రం ఇదేమి వైపరీత్యం రామలింగా, మమ్మల్ని ఏవిధంగా నువు పశువుల కొట్టంలో ఒకేరాటకు కట్టివేస్తున్నావు. లేకుంటే నక్కలతో నీవు సంభాషించావా ? చాలు చాలు ఆపవయ్యా అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు.
ప్రభూ నేను చెప్పేది వినాలని ప్రార్థిస్తున్నాను. తొలిసారి ఈపవిత్ర మైన భువనవిజయంలోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు, నా గురించి చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశం అని ప్రాధేయపడ్డాడు.
సరే చెప్పు రామలింగా, మాకు కుతూహలంగా ఉంది. నీవు నక్కలతో సంభాషించావా? నమ్మశక్యంగానిదిగా ఉందే. అందుకే మన అయ్యలరాజు రామభద్రుడు వినడానికే ససేమిరా అని బయటపడ్డాడు. మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు అని అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగనికి చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు.
రామలింగడు లేచి నిలుచుని వినమ్రంగా నమస్కరించాడు.
మిత్రమా రామభద్రా! నీవు తప్పక వినాల్సిందే. మిగిలినవారు కూడా........ నేను ఇరవైఏండ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి, ఓ అడవి మార్గంలోంచి వెళ్తుండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని తోక తొక్కేసాను. అది కుఁయ్యో మొర్రో అని అరిచి పక్కపొదలో దూరింది. అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది, దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి. అంతలో దొంగలగుంపు వచ్చి నన్ను ఎగా దిగా చూసి ఓయి బాపడా, నీకు మంత్రాలువచ్చుకదా. పదా మా నాయకుడికి పెళ్లి చేయాలి అని నన్ను ఈడ్చుకువెళ్లారు.
భయంతో వెళ్లాను. దొంగల పెళ్లిలానే జరిపించాను. వాళ్లు దోచుకు వచ్చిన వాటిల్లో దండిగా ధనకనక వస్తువులిచ్చారు. తిరిగి నన్ను ఎక్కడ్నించి తీసుకువెళ్లారో అక్కడే వదిలేసారు. పొద వద్ద ఆనక్క ఎలుగుబంటి ఉన్నాయి. అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి. అప్పుడు నక్క అంది ఏయ్ బాపడా నువ్వు నాతోక తొక్కి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు. చూసవా నా తోక మహిమ అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది.
నక్కమాటలు విన్న ఎలుగుబంటి రేయ్ నక్కఅల్లుడూ, ఒకసారి నేను నీ అదృష్టాలతోకను తొక్కుతానురా కాదనకురా, ఎప్పట్నించో ఈ అడవికి రాజును కావాలని ఆశ పడ్తున్నాను అని ప్రాధేయపడింది. ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది. ఎలుగుబంటి నక్కతోక బలంగా తొక్కేసింది. అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందానక్క.. అపుడే అడవి అదిరేలా మృగరాజు సింహం గర్జన వినిపించింది. నాకు పైప్రాణాలు పైనే పోయాయి. పక్కనున్న చెట్టు ఎక్కాను, నక్క పొదల్లో దూరింది. ఎలుగుబంటి మాత్రం బిక్కచచ్చిపోయి చేష్టలుడిగిపోయి నిలబడిపోయింది. అక్కడికి రానే వచ్చింది సింహం. నన్నురక్షించుము లేని ఆశలకుపోయితిని, ఈ అడవిని ఏలుదామని కోరికతో స్వామి ద్రోహినయితిని మన్నించు. నక్కతోక మాత్రమే తొక్కితిని తప్ప ఇతరత్రా ఎలాంటి కుట్రను చేయలేదు. అని ప్రాదేయపడిందా ఎలుగుబంటి.
Comments