చంద్రవర్ణుడు బ్రహ్మారాక్షసుని దగ్గర విద్యని అభ్యసించడం
బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడికి సహాయం చేస్తానని చెప్పాక బ్రహ్మ రాక్షసుడు ఒక ఔషధాన్ని తీసుకొని వచ్చి దానిని చంద్రవర్ణుడికి ఇచ్చి దీనిని తిను దీని వలన నీకు ఆకలి కాని,దాహం కాని,శ్రమ కాని ఇలాంటివి ఏమీ నీకు కలుగనే కలగదు. మరియు దీని వలన ఉత్సాహం కలుగుతుంది అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి భక్తితో దానిని తీసుకొని భుజించి ఆహార నిద్రల నుండి సంకటం లేని వాడు అయ్యాడు. బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడితో ఈ ఔషధ ప్రభావం వలన నీకు నా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నంతకాలం ఆకలి దప్పులు, నిద్ర కలుగదు. కానీ తరువాత అన్ని యధాప్రకారం సంభవించును. ఇంకా ఏ వ్యసనం లేకుండా అభ్యసించు అని చెప్పి రావి ఆకును ఒకదానిని తీసుకొని దానిపై శ్లోకాలు లిఖించి,వాటి తాత్పర్యం చెప్పి ప్రతి దినం ఇలాగే ఈ సమయానికి నేను చెట్టు దిగివచ్చి కొలను స్నానం చేసి, నా నిత్య కృత్యాలను తీర్చుకొని నీ దగ్గరకు వచ్చి నీకు కొత్త పాఠం చెప్పి వెళ్తాను.
ఆ సమయంలో తప్ప తరువాత మరునాడు ఆ వేళ వరకు నేను నీకు కనబడను. నిర్జన ప్రదేశం అని భయపడకు. ఇక్కడ నీకు కీడు ఏది కలగదు అని ధైర్యం చెప్పి వృక్షంపై ఎక్కి మాయమయ్యాడు. అది మొదలుగా అప్పటినుండి ప్రతిరోజు బ్రహ్మరాక్షసుడు తన దగ్గరకు వచ్చి శ్లోకాలు లిఖించి ఇస్తున్న రావి ఆకులు తీసుకుని, శ్రద్ధ భక్తులు కలవాడై పఠించి అప్పగిస్తూ వాటి అర్ధాన్ని,అభిప్రాయ రహస్యాలను తెలుసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నాడు.
ఈ ప్రకారం ఆ చంద్రవర్ణుడు ఆరు నెలల వరకు మిక్కిలి పట్టుదలతో బ్రహ్మ రాక్షసుడి వలన విద్యను గ్రహించి అసమాన పాండిత్య జ్ఞాన పరిపూర్ణుడయ్యాడు. బ్రాహ్మణుడు పండితుడు అవడం వలన నిర్ణయించిన కాలం తరువాత ఆ బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడితో ఇలా అన్నాడు: చంద్రవర్ణా! నాకు తెలిసిన అంతవరకు సర్వ రహస్యాలను బోధించి నిన్ను నేను గొప్ప పండితుడిని చేశాను. నేను నిర్ణయించిన ఆరు మాసాల కాలం ముగిసిపోయింది. నా వలన నీకు విద్య లభించింది. నీ మూలాన నాకు శాపము శాప విముక్తి అయింది.
ఇంకా నేను ఈ రూపం విడిచి, దివ్యదేహం దాల్చి స్వర్గానికి వెళ్తాను.నువ్వు నీ గ్రామానికి వెళ్లి వివాహితుడువై సకల ఐశ్వర్యాలు కలిగి పుత్ర పౌత్రాభిలతో వృద్ధి చెంది సంతోషంతో నిత్య భోగాలను అనుభవించు అని ఆశీర్వదించాడు.
చంద్రవర్ణుడు మహా భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మహానుభావా! మీ కృపవలన నా కోరిక తీరి కృతజ్ఞుణ్ణి అయ్యాను. తగిన గురువు దొరకాలి అనే కోరిక నేను పోగొట్టుకుంటున్న సమయంలో మీరు నా యందు దయ చూపి నన్ను చేరదీసి నన్ను విద్వాంసుడిని చేసి పుణ్యం కట్టుకున్నారు. భగవంతుడి ఆజ్ఞానుసారం ప్రవర్తించగలను అని వినయంగా విన్నవించాడు.
ఇలా వారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి అక్కడికి వచ్చింది. అందులో నుండి వచ్చిన దివ్య పురుషుడు ఒకడు బ్రహ్మ రాక్షసుడిని పిలిచి పుణ్యాత్మకా! రా, నీ పాపాల నుండి నువ్వు విముక్తిడివి అవడం వలన నేను నిన్ను తీసుకుని స్వర్గానికి వెళ్లడానికి విమానం తీసుకువచ్చాను అని చెప్పాడు. ఆ క్షణములో బ్రహ్మ రాక్షసుడు ఆ ఘోర రూపం తొలగి అద్భుతమైన తేజస్సు కలిగిన రూపాన్ని పొందాడు.ఆ వింతని చూస్తూ చంద్రవర్ణుడు ఆశ్చర్య పడుతుండగా దివ్య దేహం ధరించిన బ్రహ్మ రాక్షసుడు అతనిని దీవించి మహా సంతోషంతో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు.
ఈ విధంగా తన గురువు స్వర్గానికి వెళ్ళిన తరువాత చంద్రవర్ణుడు అక్కడ నుండి స్వగ్రామానికి బయల్దేరడానికి ప్రయాణమయ్యాడు. అప్పటికి అతనికి ఔషధ మహిమ తొలగి అతనికి ఆకలి దప్పులు కలుగుట ప్రారంభమైంది.
Comments