ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట (part 4)
రాజాధిరాజులైన మీ నీడన బతుకీడ్చు ఈ బ్రాహ్మణుడు తప్పు చేయటం,అది తమరు విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణం అనుభవిస్తున్నాను. హతవిధీ! సత్యనిరూపణ కావలి ...... ఇక విషయం తమకు తెలిసేలా చేస్తాను. అయ్యా! నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ చాటింపు విని ఆరా తీసిన నేరానికి ఈ వ్యాపార ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించారు. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టారు. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎలా అమ్ముతున్నారని అడిగాను. పొంతనలేని మాటలు చెప్పారు. ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని కలిశాను. ఈ గృహంలో దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతులపై నాకుఅమ్మాడు. సభా మధ్యలో నిల్చొని కంచుగంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు.
"నీవు చెప్పునది సరే. ముందు షరతుల ప్రకారం నీవు ఈ సరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకు ఇవ్వకుండా మొండి కేస్తున్నావు. రాయల వారికి చెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే అన్నావని ప్రధానంగా నీపై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగకవీ, నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసినవారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురిచేయాలి. నాకెందుకు ఈ విషమ పరిస్థితి కల్పించావు. నీ తప్పు చాలా స్పష్టంగా కన్పిస్తుంది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు అని రాయలు అసహనంగా అన్నాడు. సభలోని వారంతా హీనంగా రామలింగనివైపు చూసారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురికావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. మహామంత్రీ నేను ఏ అపరాధం చేయలేదు. నాచే రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి. నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు తెలియగలదు.
పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగకవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడు అవుతాడని కొండంత ఆశ పడ్డాడు. కానీ ఇతడు పెద్ద తప్పుచేసాడు. ఈ కవిలో ఇంత హీన లక్షణాలున్నాయా ? అని అనుకున్నాడు.
"రామలింగా, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది అని తిమ్మరుసు అన్నాడు.
"మహామంత్రీ తమరు తప్పులో కాలు వేసారు. తమ వంటివారు ఇలా చదివితే ఎలా ? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా! ఆపత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే వేరే వారి పేర్లున్నాయి. దయచేసి చదవండి."
ఒక్కనిదే ఉంది. వేరెవ్వరి పేరు లేదే. ఎన్ని కళ్లతో చదవినా మారిపోదుకదా ! నీకు ఛాదస్తం మరీ ఎక్కువలా ఉంది అని మంత్రి అన్నాడు. దానితో శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగనివైపే చూసాడు.
ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు ఉన్నాయి. రామలింగకవితో బాటు దయ్యాలు,పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాసాడు ఈ పెద్దమనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో బాటు దయ్యాలు,పిశాచాలున్నాయి అని అతనే లిఖిత పూర్వకంగా ఒప్పు కున్నాడు. అవి చెల్లించవా ? ఇదేం న్యాయం మహామంత్రీ. అందుకే ఈ పెద్దమనిషితో పదేపదే అన్నాను. ఏలినవారికి చెప్పినా ఒక్కరూక రాలదని, ఇప్పుడూ చెప్తున్నాను. లింగిశెట్టికి నేను నా వాటా చెల్లించాను. ఇక ఏ భూత మాంత్రికున్నో, పిశాచవైద్యున్నో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు-పిశాచాలు వద్ద వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు అని అన్నాడు. దానితో సభికులు గొల్లుమని నవ్వుతుండగా రామలింగడు ఏలాంటి జంకుగొంకు లేకుండా మరీ చెప్పాడు.
రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ తిమ్మరుసువైపు చూసాడు. ఆయనకూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ నవ్వులమయం అయ్యింది. లింగిశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు.
నవ్వులతో ఎంతసేపటికి తేరుకోని సభ నుద్దేశించి “మన్నించండి రాజా! నాకు చీడపీడలపై ఎలాంటి నమ్మకం లేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను, ఇతడు తమకు బాల్యస్నేహితుడు అనే ముసుగులో ఉంటూ, ఇతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేళమాళిగ సొరంగంఉంది. పెద్ద ఎత్తున మారణాయుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు.
ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్ధంకాక తిమ్మరుసు వైపు చూసాడు.
లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నాడు. రాయలు కన్నెర్ర చేయగానే నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపకతప్పలేదు. ఆ సొరంగ మార్గం లోంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగులవారికి దయ్యాలు ఎదురైన వని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్లాక అన్నివిధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను.
అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయనివాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలనుకున్నాను. తీరా ఈకవి చాలా తెలివైనవాడు. కనుక, నా గుట్టు తెలుసుకోగలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తీ!"
"ఏమయ్యా ! నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీయెడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందుకు ఈ ద్రోహ చేయాలి అనిపించింది. దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు.
ఏలినవారికి నాదో విన్నపం. ఇతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరకబలుడు కానేకాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగమార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చు ధనం కంటే ఇతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగమార్గంలో దయ్యాలున్నట్లు పలికి వెళ్లిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈ సరికి నాకుకన్పించాలి. కానీ ఇంతవరకు నేను చూడ నైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు తగిన శిక్ష ఆర్ధికంగా అనుభవించాడు. ఏది ఏమయినా ఇతడు చేసినది తప్పే, అందుకు శిక్షగా దేశద్రోహులకు విదించే మరణదండన, కనుగుడ్లు పెరికివేయుంచుట వంటివి విధించవద్దని నా మనవి. దేశబహిష్కారణే మరణదండనతో సమానం. రామలింగడు సభ మద్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినమ్రుడై చెప్పాడు.
రాయలు గట్టిగా కళ్ళుమూసుకున్నాడు. నిజమే రామలింగడు చెప్పినట్లు దేశబహిష్కారంతో సరిపుచ్చాలి. లింగిశెట్టి తనకు బాల్యస్నేహి తుడు .చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశబహిష్కార శిక్ష విధించాడు.
ఆ తరువాత రాయలు సింహాసనం దిగి రామలింగకవిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. కవి చరిత్ర మరువదు మీ చతురత, స్వామిభక్తి పరాయణత, సదా నిలుచును మీ యెడల మా కృతజ్ఞత. ఈ రోజు నా హృదయం తేలిపోవుచున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొను చున్నాను.. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను. కాదనకండి అని అన్నాడు. ఇతరత్రా కూడా పదేపదే మెచ్చుకుని ధనకనక వస్తువాహనాలతో సత్కరించాడు.
"ప్రభూ ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చినది. అందులోకి వెళ్లగానే నాకు కవిగా కాకుండా నా మాతృభూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్యపిల్లలతో జీవించగలను అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డువస్తున్నానని వేరేవిధంగా భావించవద్దు. తిమ్మరుసు రామలింగని వద్దకు వచ్చి నాయనా నీవు గొప్ప విషయాన్ని బయట పెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్టు చేసావు. తక్షణం ఆ సొరంగమార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసు కుంటాం. నీవు ఈ రోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా కోరుతున్నాను అని అడిగాడు. దానిని రామలింగడు చేతులు కట్టుకుని విన్నాడు.
Comments