ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
పాపాత్మురాలైన మంథర చేసిన దుర్బోధలన్నీ కైకేయికి తలకెక్కాయి. తాను దశరథమహారాజు వచ్చినప్పుడు నడుచుకోవలసిన తీరును గూర్చి మంథరతో చర్చించింది. అంతలోనే తాను తలపెట్టిన కార్యం సఫలమవుతుందా, కాదా? అని బేలవలె భయపడసాగింది. వారిద్దరూ కూడబలుక్కుని 'అంతా బాగుందని' అనుకున్నారు.
కైకేయి తీసిపారవేసిన నగలన్నీ చిందరవందరగా పడి ఆకాశంలో నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి. మాసిన చీర కట్టుకుంది. చక్కగా అల్లుకున్న జడను విడదీసి జుట్టంతా విరబోసుకుంది. కటిక నేల మీద మరణించిన కిన్నర స్త్రీలా పడి ఉంది.
దశరథమహారాజు రాముని పట్టాభిషేకం విషయంగా ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నాడు. మిగిలిన ఏర్పాట్లన్నింటినీ అతి సన్నిహితులైన వారికి, పురోహితులకు అప్పగించి తాను అంతఃపురానికి వెళ్ళాడు.
ఇంతవరకు రాముని పట్టాభిషేకం విషయం తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవహరిస్తూ వచ్చాడు. సమయం దగ్గర పడుతున్నకొద్దీ, విషయాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇంకా అలస్యం చేయకూడదని అనుకున్నాడు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి కైకేయికి తానే స్వయంగా చెప్పటం ఉచితంగా ఉంటుందని అనుకున్నాడు. ఈ విధంగా తనలో తానే అనుకుంటూ కైకేయి మందిరాన్ని ప్రవేశించాడు.
కైకేయి మందిరంలో నెమళ్ళు, రాజహంసలు, క్రౌంచపక్షులు పెంచబడుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ వాటి కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. ఇంటినిండా అనేక మంది గూనివాళ్లు, మరుగుజ్జులైన దాసీలు సందడిగా తిరుగుతూ ఉంటారు. అన్ని ఋతువుల్లోనూ పుష్పించే వృక్షాలతో కూడిన అరామాలెన్నో ఉన్నాయి. వాటి మధ్య దంతంతోను, వెండి బంగారాలతోను తాపడం చేసిన అసనాలుంటాయి. చూసే వారికి అహ్లాదం కలిగిస్తూ ఇంద్రుని ఉద్యానవనమా అని అనిపిస్తూ ఉంటుంది.
అటువంటి భవనంలోకి దశరథుడు కామోద్రేకంతో రతికోసం వచ్చాడు. అక్కడ మనుష్య సంచారంలేదు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ తాను రాగానే కైకేయి ఎదురువచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళేది. ఈనాడు ఆమె జాడ అయినా తెలియటంలేదు. మనస్సు ఏదో కీడును శంకిస్తూ ఉండగా, అక్కడున్న ద్వారపాలకుని అడిగాడు.
ద్వారపాలకుడు: మహారాజా! రాణిగారు బాగా కోపంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు అలకాగృహంలో ఒంటరిగా ఉన్నారు.
ద్వారపాలకుని మాటలు విన్న దశరథుని ఉత్సాహమంతా నీరు కారిపోయింది. దుఃఖంతో నిండిన మనస్సుతో కైకేయి ఉన్న కోపగృహాన్ని చేరుకున్నాడు. కైకేయి కుపితురాలై నేలపై మరణించిన దానిలా పడి ఉంది.
కైకేయి మరణించిన దానిలా కటికనేల మీద పడి ఉండటం దశరథుడు చూశాడు. ఆమె జుట్టంతా దయ్యం పట్టినదానిలా విరబోసుకుంది. ఆమె విసరివేసిన మణిమాణిక్యాలన్నీ నక్షత్రాల్లాగా మెరిసిపోతున్నాయి.
అప్పుడు దశరథుడు, కైకేయిని అనునయిస్తూ ఇలా అన్నాడు:
"ఓ దేవీ! నువ్వు ఎల్లప్పుడూ మంగళకరమైన లక్షణాలు కలిగి ఉండేదానవు. ఈ రోజు నీకు నాపై కోపం ఎందుకు వచ్చిందో తెలియటంలేదు. నిన్ను ఎవరైనా అవమానించారా? దూషించారా? ఏ కారణం చేత నీవు ఈ కోపగృహంలో ఒంటరిగా పడి ఉన్నావు. నీవు నోరు తెరచి అడిగిన వెంటనే ఎంతటి కష్టసాధ్యమైన కోరికనైనా కూడా తీర్చేందుకు నేనుండగా నీవెందుకు దుఃఖించుచున్నావు? పీకిపారవేసిన తీగవలె వడలిపోయి ఉన్నావు.
నీవేమైనా అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీ బాధ ఏమిటో చెప్పు. వెంటనే రాజవైద్యులను పిలిపిస్తాను. లేదా ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలని అనుకొంటున్నావా? లేక ఎవరైనా నీకు అపకారం తలపెట్టారా? నిన్ను సంతోషపెట్టేందుకు నన్ను ఏం చేయమంటావో అజ్ఞాపించు. నిన్ను కష్టపెట్టినవాడు చంపదగినవాడైతే చంపుతాను. ఒకవేళ నేను స్వయంగా చంపరాదన్న నియమమున్నట్లయితే, ఎవరిచేతనైనా చంపిస్తాను. నీకు ప్రీతిపాత్రుడైన వాడు ఒకవేళ దరిద్రుడైతే వాడిని కుబేరునిగా చేస్తాను. ఒకవేళ నీకు అపకారం తలపెట్టినవాడు సంపన్నుడే అయితే వాడి సంపద లన్నింటినీ హరిస్తాను.
కైకేయీ! నేను, నాకు సంబంధించిన వారంతా నీ అధీనంలోని వాళ్లమే గదా! నిన్ను వ్యతిరేకించే వారెవరైనా సరే, నేను సహించను. నీ కోసం నా ప్రాణాలనే అర్పిస్తాను. నీకు నాపై ఎంత అధికారమున్నదో నువ్వు ఎరుగవా? ఈ మాటలన్నీ కూడా నేను చేసిన పుణ్యంపై ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నన్ను నమ్ము. నీ కేది ఇష్టమో అది తప్పక చేస్తాను.”
అంతట కైకేయి తన భర్త చేత శపథం చేయించుకొని గాని తన మనస్సులోని మాటను బయట పెట్టరాదని నిశ్చయించుకొంది.
Comments